విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రఘు (44) హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో పోలీస్ వర్గాల్లో, కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..గాంధారి పోలీస్ స్టేషన్లో గత రెండేళ్లుగా కానిస్టేబుల్గా రఘు విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం రాత్రి యథావిధిగా నైట్ డ్యూటీ నిర్వహించిన ఆయన, మంగళవారం ఉదయం విధుల్లోంచి రిలీవ్ అయ్యారు. అనంతరం తన స్వగ్రామమైన బాన్సువాడకు బయలుదేరి వెళ్లారు.
ఇంటికి చేరుకున్న కాసేపటికే ఆయన ఒక్కసారిగా చాతిలో తీవ్రమైన నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆందోళనకు గురైన వారు వెంటనే అప్రమత్తమై ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రఘు మృతికి గుండెపోటే కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం తెలిసిన వెంటనే తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రఘు మృతి పట్ల పలువురు పోలీస్ అధికారులు సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
