నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి అందించాల్సిన గురుకుల పాఠశాలలు మృత్యుకూపాలుగా మారుతున్నాయా? అధికారుల నిర్లక్ష్యం పసిప్రాణాలను బలితీసుకుంటోందా? అంటే ‘అవుననే’ సమాధానం వినిపిస్తోంది.
మెండోరా మండలం పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్థిని మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ముప్కాల్ మండలానికి చెందిన సాయి లిఖిత పోచంపాడు గురుకులంలో విద్యనభ్యసిస్తోంది.
ఈ నెల 5వ తేదీన పాఠశాలలో వడ్డించిన ఆహారం వికటించడంతో లిఖిత తీవ్ర అస్వస్థతకు గురైంది. వరుస వాంతులతో నీరసించిపోయిన బాలికను చూసి తోటి విద్యార్థులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమించడంతో వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లిఖిత మరణించింది.అధికారుల నిర్లక్ష్యానికి చిదిమివేయబడటం తల్లిదండ్రులను కన్నీరుమున్నీరు చేస్తోంది.”మా బిడ్డను చదివించుకుని ప్రయోజకురాలిని చేద్దామనుకున్నాం.. కానీ ఇలా శవమై వస్తుందని ఊహించలేదు” అంటూ లిఖిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు పోయాయని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
