నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఒకటవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..శ్రీ లక్ష్మీ నరసింహ మెస్ అండ్ టీ హోటల్ సమీపంలో సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
స్పందించిన వన్ టౌన్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి వేషధారణ, ఇతర ఆనవాళ్లను బట్టి చూస్తుంటే అతను మతిస్థిమితం సరిగా లేక తిరుగుతున్న వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి తెలిపారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని బంధువుల గురించి సమాచారం ఉన్నవారు 87126 59714 నంబరులో నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కోరారు.
