నగరపాలక సంస్థ లో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని అన్ని డివిజన్లో అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు. కనీస మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం ఇబ్బందికరమైన విషయమన్నారు. అలాగే కార్పొరేటర్లకు సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
స్పెషల్ ఫండ్ లేకపోవడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభారతి తదితర పనులు అర్థంతరంగా నిలిచిపోయాయన్నారు. అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. యూడీఎఫ్ ఫండ్ కోసం కృషి… తెలంగాణలోనే అతిపెద్ద నగరంగా నిలిచిన నిజామాబాద్ కు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు.
యూడీఎఫ్ కింద రూ.400 కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఇటీవలే ఇందుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయించామన్నారు. అలాగే మరో కేంద్ర పథకం కింద రూ.200 కోట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా నగరంలో యూజీడి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
బీజేపీ కార్పొరేటర్ల నిలదీత… కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు పలు సమస్యలను ప్రస్తావించారు. ఎజెండాకు ముందు తమ సమస్యలను వినాలంటూ పట్టుబట్టారు. దీంతో కార్పొరేటర్ లందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించారు.
ప్రధానంగా మురికి కాలువలు శుభ్రం చేసే కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పారు. ఏళ్లుగా ఉన్న సమస్యలపై ఎన్నిసార్లు వినతులు అందించిన అధికారులు స్పందించడం లేదని ప్రశ్నించారు.
శానిటేషన్ చాలా పెద్ద సమస్యగా మారిందని, ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుందన్నారు. జెసిబిలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదని, డీజిల్ కి మాత్రం బిల్లులు పెడుతున్నారన్నారు. యూజిడి పనులకు 180 మంది సిబ్బంది ఉండాల్సింది, 30 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ఇలా అయితే పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు.
