నగరంలోని బ్యాంక్ కాలనీలో శనివారం దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడి భారీగా బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
స్థానికుల వివరాల ప్రకారం..బ్యాంక్ కాలనీకి చెందిన బాధితులు పని నిమిత్తం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటంతో షాక్కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తెరిచి ఉండటంతో పాటు, అందులోని బంగారం ఆభరణాలు, కొంత నగదు మాయమైనట్లు గుర్తించారు.
వెంటనే బాధితులు మూడవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్లూస్ టీమ్ సహాయంతో దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల పుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
పక్కా ప్రణాళికతోనే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
