ఉద్యమాల ఖిల్లా జగిత్యాల గడ్డ మరో చారిత్రక ఘట్టానికి వేదికవుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు జగిత్యాల కేంద్రం సర్వసన్నద్ధమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా, మినీ స్టేడియం వేదికగా గులాబీ దళం సింహనాదం చేయబోతోంది. ఈ సభ ద్వారా అటు రాజకీయ సమీకరణాలను మార్చడంతో పాటు, ఇటు శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు పార్టీ నాయకత్వం వ్యూహరచన చేసింది.
ప్రభుత్వంపై పోరాట కార్యాచరణను ప్రకటించేందుకు ఈ సభను ఒక వేదికగా బీఆర్ఎస్ మలచుకుంది.ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు జగిత్యాలకు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లాకు చెందిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జగిత్యాలకు బయలు దేరుతున్నారు.
దీంతో దారులన్నీ జగిత్యాల వైపే మళ్లుతుండటంతో. జనసముద్రాన్ని తలపించబోతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి నేపథ్యంలో కేసీఆర్ చేసే దిశానిర్దేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగా రాజకీయ ఉద్దండుడు, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనుండటంతో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ వ్యూహ ప్రతిభకు, జీవన్ రెడ్డి ఛరిష్మా తోడవడంతో జగిత్యాల గడ్డపై కొత్త రాజకీయం మొదలుకాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సభ కోసం ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్, , ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివెళ్తున్నారు. ప్రతి గ్రామం నుంచి గులాబీ శ్రేణులు ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలను సమీకరించారు.
ప్రస్తుతం కోతలు పూర్తి కావడంతో రైతులు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు యువకులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు సభకు క్యూ కడుతున్నారు.
