ఆలూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం (సొసైటీ) పరిధిలో ఉన్న ఇస్సాపల్లి గ్రామ రైతులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలూర్ సీఈఓ ఛాంబర్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆందోళనలో ఉన్న రైతులు మాట్లాడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. గత 20 రోజులుగా మొక్కజొన్న కోతలు పూర్తయి ధాన్యం రోడ్లపైనే కుప్పలుగా పేరుకుపోయిందని తెలిపారు.భానుడి ప్రతాపానికి ధాన్యంలో తేమ తగ్గి బరువు తగ్గిపోతోందని, మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలకు మక్కలు తడిసి ముద్దవుతున్నాయని రైతులు వాపోయారు.
ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సొసైటీ అధికారులు కనీసం తమ గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదని, సమాధానం చెప్పే నాధుడు కరువయ్యాడని మండిపడ్డారు.
కష్టపడి పండించిన పంట కళ్ల ముందే పాడవుతుంటే తట్టుకోలేకపోతున్నామని, వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించి మద్దతు ధరతో ప్రభుత్వం పంటను సేకరించాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు మొండివైఖరి వీడకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
