భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకటవ టౌన్ ఎస్హెచ్ఒ రఘుపతి కథనం ప్రకారం… నిందితుడు బాబుకు, రాధకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది.
వీరికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్య వేరే వాళ్లతో తిరుగుతోందనే నెపంతో బాబు ఆమెపై నిరంతరం అనుమానం పెంచుకున్నాడు.
ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో.. మనస్పర్థలు వచ్చి గత పదేళ్లుగా రాధ కుమార్తెతో కలిసి మిర్చి కాంపౌండ్లోని తన తల్లిగారి ఇంట్లోనే ఉంటోంది. బాబు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు.
ఈ క్రమంలో ఇటీవల బాబు భార్య వద్దకు వచ్చాడు. రాధ తాను చుట్టాల ఇంటికి వెళ్తానని చెప్పడంతో బాబు ఆగ్రహానికి గురయ్యాడు. ‘నేను నీ దగ్గరికే వస్తే… నువ్వు నన్ను వదిలేసి వేరే వాళ్ల ఇంటికి వెళ్తావా?’ అంటూ నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆగ్రహంతో ఊగిపోయిన బాబు, తాను వెంట తెచ్చుకున్న కత్తితో రాధపై దాడి చేసి పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం ఈ ఘటనపై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బాబును అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
