మండలంలోని సాలూర క్యాంప్ పరిధిలో యూరియా కొనుగోలుకు సంబంధించి ఆన్ లైన్ విధానం ఎత్తివేయాలని డిమాండు చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు సాలూర మండల కేంద్రంలో రైతులు ఈ ఆందోళన చేసారు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ యాప్ బుకింగ్ విధానం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
స్మార్ట్ఫోన్లు, యాప్లపై అవగాహన ఉన్నవారు వెంటనే యూరియా బుక్ చేసుకోగలుగుతున్నారని, అయితే సాంకేతిక పరిజ్ఞానం లేని చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క అల్లాడిపోతున్నారని ఆరోపించారు. దీనికి తోడు యాప్లో యూరియా బుక్ చేసుకున్న వారికి, బలవంతంగా ‘సాగరిక’, ‘నానో యూరియా’ వంటి ఇతర ఉత్పత్తులను లింక్ పెట్టి అంటగడుతున్నారని రైతులు మండిపడ్డారు.
యూరియాతో పాటు ఆ ఉత్పత్తులను కూడా యాప్లోనే కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించాలి కానీ, ఇక్కడకు వచ్చాక బలవంతంగా అదనపు బస్తాలను అంటగట్టి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సమస్యలపై నిలదీసిన రైతులను దుకాణదారులు దూరం పెడుతున్నారని, నిన్న సాగరిక ఉత్పత్తి గురించి ప్రశ్నించినందుకు ఒక రైతుకు డీఏపీ (DAP) బిల్లు కూడా చేయకుండా వేధించారని తోటి రైతులు వాపోయారు.
యూరియా అందరికీ సమానంగా అందేలా చూడాలని, ఈ అన్యాయంపై అవసరమైతే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలను కలిసి ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా నిరసనను ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
