టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (టీటీసీ) ఆగస్టు–2026 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆగస్టు 2న భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్–163 అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే పరీక్షల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ సబ్డివిజన్ పరిధిలోని మొదటి, రెండో టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
సెక్షన్–163 ప్రకారం పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదని, నిషేధిత వస్తువులతో సంచరించరాదని ఆదేశించారు.
అలాగే పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ కేంద్రాలను ఆగస్టు 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేయాలని సూచించారు.ఆగస్టు 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, ప్రజలు సహకరించి పరీక్షల నిర్వహణకు తోడ్పడాలని పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
