ఈ-సాక్ష్య అమలుపై డీజీపీ దిశానిర్దేశంరాష్ట్ర పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సీసీటీఎన్ఎస్ 2.0’, ‘ఈ-సాక్ష్య’ వ్యవస్థల సమర్థ అమలుపై ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నేరాల నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రతి దశను డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా నేరస్థుల సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, దర్యాప్తు ప్రక్రియలో నాణ్యతను పెంచాలని సూచించారు. ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నేర సంఘటనలకు సంబంధించిన ఆధారాలను సేకరించడంలోనూ, వాటిని సురక్షితంగా కోర్టుకు సమర్పించడంలోనూ ‘ఈ-సాక్ష్య’ వ్యవస్థ కీలకం కానుందని డీజీపీ వివరించారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల భద్రత విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి ఈ వ్యవస్థలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా నేర నియంత్రణలో రాష్ట్ర పోలీసు శాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ జిల్లా నుంచి అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ పాల్గొనగా, వివిధ విభాగాలకు చెందిన ఏసీపీలు, ప్రత్యేక శాఖల ఇన్ స్పెక్టర్లు, సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.
