నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న రౌడీ షీటర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్గా ఉన్న మిర్జా సల్మాన్ అలీ బేగ్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
గతంలో ఇతనిపై విధించిన బౌండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించడంతో, ఆ బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తూ రూ.1,00,000 ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని అధికారులు ఆదేశించారు.హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నగర వ్యాప్తంగా నివారణాత్మక చర్యలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగానే చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే మార్గదర్శకత్వంలో, మలక్పేట్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో చాదర్ఘాట్ పోలీసులు రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
రౌడీ షీటర్ మిర్జా సల్మాన్ అలీ బేగ్ గతంలో సత్ప్రవర్తనతో ఉంటానని పోలీసుల వద్ద బౌండ్ ఓవర్ బాండ్ సమర్పించాడు. అయితే, ఇటీవల ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన పోలీసులు, చట్టపరమైన విచారణ ప్రక్రియను చేపట్టారు.చట్టపరమైన విచారణ పూర్తయిన అనంతరం, నిబంధనలను అతిక్రమించినందుకు బాండ్ను జప్తు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాల మేరకు, జూన్ 9వ తేదీన రౌడీ షీటర్ సల్మాన్ అలీ బేగ్ రూ.1 లక్షను చలాన్ రూపంలో ప్రభుత్వానికి జమ చేశారు.ఈ సందర్భంగా చాదర్ఘాట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.బి. మురారి మాట్లాడుతూ.. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అలవాటుగా నేరాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా బాండ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఇలాంటి కఠినమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.
