రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గురువారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్కు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు యూరియాను సరఫరా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, పంపిణీ వ్యవస్థలోని లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం యాప్లో యూరియా బుకింగ్కు మండలాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల రైతులు దూర ప్రాంతాల్లోని పంపిణీ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో రవాణా ఖర్చులు పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని తెలిపారు.
జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఎకరానికి ఎన్ని బస్తాల యూరియా కేటాయిస్తారనే విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని, దీంతో రైతుల్లో గందరగోళం నెలకొందని చెప్పారు.
వినతిపత్రంపై స్పందించిన జిల్లా కలెక్టర్, యాప్లోని సాంకేతిక సమస్యలను పరిశీలించి మండలానికి బదులుగా రెవెన్యూ గ్రామాన్ని ప్రామాణికంగా తీసుకుని స్థానికంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎకరానికి యూరియా కేటాయింపులపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కంచెట్టి గంగాధర్, గద్దె భూమన్న, ప్రమోద్ కుమార్, నక్క రాజేశ్వర్, అనంత్ రెడ్డి, నూతల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కర్క గంగారెడ్డి, విజయ్ కృష్ణ, బొబ్బిలి వేణు తదితరులు పాల్గొన్నారు. :::
