గాండ్ల సంఘం ప్రతిభా పురస్కార కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..ఇందూరు: విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రతిభ అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఐక్యమత్యానికి ప్రతీక గాండ్ల సంఘమని కొనియాడారు. విద్యతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏదైనా దొంగలించబడుతుంది, కానీ విద్యను ఎవరు దొంగిలించే ప్రసక్తే లేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పిందన్నారు.
అయితే స్థల ప్రభావంతో ఇందూరులో ఇబ్బందులు ఎదురయ్యాయని, దీంతో తాను సీఎం దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో సహాయం…శ్రీ ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా వంద మంది పేద విద్యార్థులకు విద్యను అందజేస్తున్నామన్నారు.
అలాగే గాండ్ల సంఘం పేద విద్యార్థులకు కూడా తనవంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్, కార్పొరేటర్లు ప్రసన్న సత్యపాల్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ఎర్రం సుధీర్, మనోహర్, బీజేపీ నాయకులు గిరిబాబు, నూనె వేణు, గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి మోహన్, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
