పోలీస్ అయినంత మాత్రాన చట్టాన్ని ఉల్లంఘిస్తావా అంటూ మధురానగర్ ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఎస్సై అయిన పిటిషనర్ ఉస్మాన్(75)పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది ఎలాంటి నోటిస్ ఇవ్వకుండా ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లడంపై మండిపడింది.
మధ్యాహ్న భోజన సమయం వరకు కోర్టులోనే నిలబడాలని ఎస్సైని ఆదేశించింది. పోలీస్ కమిషనర్ నుంచి నివేదిక తెప్పించుకుని అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
మే 18న యూస్ఫగూడలోని తన ఇంటిలో ఉండగా పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ రిటైర్డ్ ఎస్సై ఉస్మాన్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ టీ.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.
