కారులో వచ్చి మహిళలే లక్ష్యంగా వరుస దాడులు..
నిమిషాల వ్యవధిలోనే రెండు చోట్ల చోరీలు
నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్లకు పాల్పడి స్థానికంగా కలకలం సృష్టించారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మహిళలను అడ్రస్ అడిగే నెపంతో మెడలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
ఈ ఘటనలు మాక్లూర్, నిజామాబాద్ మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. మొదట శనివారం ఉదయం మాక్లూర్ మండల పరిధిలో ఉదయం పని నిమిత్తం వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఆమె వద్దకు కారులో వచ్చి అడ్రస్ అడిగే నెపంతో మాటల్లో దించారు. ఆమె అప్రమత్తం అయ్యేలోపే, మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని వేగంగా కారులో పరారయ్యారు.
ఇదే ముఠా నేరుగా నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలోని జీజీ కాలేజ్, దుబ్బా ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంటి ముందు ఆకిలి ఊడుస్తున్న మరో మహిళను భయపెట్టి, ఆమె మెడలో ఉన్న రెండు తులాల గొలుసుతో పాటు చెవి కమ్మలను కూడా తెంపుకుని దుండగులు పారిపోయారు.ఘటనలపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.
నగరంలోని ప్రధాన మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. చైన్ స్నాచర్లు ప్రయాణిస్తున్న కారును గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
