విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం.రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జిల్లా బీజేవైఎం విమర్శించారు. విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, విద్యాశాఖలో సమీక్ష సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు. కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందడం లేదని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారినే చిన్నచూపు చూస్తూ అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గతంలో విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాయని పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.
