నగరంలోని హస్మీ కాలనీలో ఆదివారం దుండగులు రెచ్చిపోయారు. పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా ఉన్న మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి నగదు, బంగారు ఆభరాణాలను బలవంతంగా దోచుకెళ్లారు.
స్థానికుల వివరాల ప్రకారం..హస్మీ కాలనీకి చెందిన ఓ ఇంట్లోకి ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళలను బెదిరించి, వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.
భయభ్రాంతులకు గురిచేసిన దుండగులు ఇంట్లో భద్రపరిచిన రూ. 3 లక్షల నగదుతో పాటు, 3 తులాల బంగారు ఆభరాణాలను బలవంతంగా అపహరించుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితుల కుటుంబ సభ్యుల సమాచారం మేరకు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంటనే తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు ఆరా తీశారు.
క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
