వరి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలు, మిల్లులపై జరుగుతున్న దాడులతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.
సద్ధానంద్గంజ్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో జిల్లాలోని రెండు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, మిల్లర్లు సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.వరి ధాన్యం సేకరణ విధానంలో స్పష్టత లేకపోవడంతో మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు మిల్లులపై జరుగుతున్న దాడులతో మిల్లర్లు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
సమస్యలకు పరిష్కారం చూపే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు మోటూరు దయానంద్గుప్తా, మోహన్రెడ్డి తదితరులతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సమ్మెకు సంబంధించిన పూర్తి డిమాండ్లను త్వరలో ప్రకటించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
