ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపీ సేవలు ఎంతో కీలకమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలు, కీళ్లు, కండరాల సమస్యలు, నడకలో ఇబ్బందుల నుంచి కోలుకోవడంలో ఫిజియోథెరపీ చికిత్స ఉపయోగకరంగా ఉంటుందని సీపీ తెలిపారు.
ప్రస్తుత జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నడక, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
రోగులకు చికిత్స అందించడంతోపాటు వారు తిరిగి సాధారణ జీవన విధానానికి చేరుకునేలా పునరావాసం కల్పించడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ అశ్విని జోషి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్కుమార్, కోశాధికారి డాక్టర్ కీర్తిగుప్తా తదితరులు పాల్గొన్నారు.
