నగర శివారులోని సారంగాపూర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై శనివారం సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ పర్యవేక్షణలో సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.
ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,300 నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సిక్స్త్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు అప్పగించారు. జిల్లాలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
