ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం రాంపూర్ లో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. వృద్ధాశ్రమంలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు.
వృద్ధులు విశ్రాంతి తీసుకునే గదులలో వసతులు గమనించిన కలెక్టర్, కూలర్లు, టెలివిజన్ వంటి సదుపాయాలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని సమకూర్చాలని రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులను ఆదేశించారు. ఆశ్రమం చుట్టూ ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను శుభ్రం చేయించాలని స్థానిక అధికారులకు సూచించారు. కిచెన్ లో ఆహార పదార్థాలు, వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు.
కాలపరిమితి ముగిసిన పలు సరుకులు ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమం నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నిర్వాహకుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఆశ్రమంలో ఉండే అనాథ వృద్ధులను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ, చక్కగా వారి ఆలనాపాలన చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. నామ్ కే వాస్తే అన్నట్టు కాకుండా వృద్ధుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హితవు పలికారు.
వృద్ధులకు అల్పాహారం, భోజనం అందించే విషయంలోనూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన మోతాదులో పౌష్టికాహారం అందించాలని సూచించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీ పడకూడదని అన్నారు. అవసరమైన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలన్నారు.
తాను త్వరలోనే మళ్లీ ఆశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, నిర్వహణ తీరులో మార్పు కనిపించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు స్పష్టం చేశారు. అన్ని సదుపాయాలు, వసతులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిణి పద్మ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్స ఆంజనేయులు, డిచ్ పల్లి తహసీల్దార్ సతీష్, ఆర్.ఐ ప్రభు తదితరులు ఉన్నారు.
