ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు వర్ని మండలం జలాల్పూర్ తదితర ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు.
జలాల్పూర్ వద్ద లో లెవెల్ వంతెన పై నుంచి ప్రవహిస్తున్న వరద జలాలను పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జలాల్పూర్ – బడాపహాడ్ మార్గంలో రాకపోకలను నిలిపి వేయించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ ను దారి మళ్లించాలని అన్నారు.
చెరువులు, కాల్వలు, కుంటలు, వాగులలోకి ఎవరు కూడా చేపల వేటకు, ఈత కోసం వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న చోట ఇరువైపులా పోలీసు బందోబస్తు నిర్వహించాలన్నారు.
జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించడం, ప్రజలు, పశువులు వరదలో చిక్కుకోవడం వంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
రెండు రోజుల పాటు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున, అధికారులు అందరూ తమతమ కార్యస్థానాలలో ఉంటూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని హితవు పలికారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలన్నారు.
కాగా, గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న దృష్ట్యా, శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు, సాధారణ ప్రజానీకం ఎవరు కూడా గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయకూడదని కలెక్టర్ సూచించారు.
అంతకుముందు కలెక్టర్ నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు పరిశీలించారు. అలాగే, బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్, సరస్వతీ నగర్ ప్రాంతాలలో పర్యటించి, స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
వార్డు ఆఫీసర్లు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని అన్నారు.
ప్రమాదాలు జరిగిన తరువాత సహాయక చర్యలు చేపట్టడానికి బదులు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని అధికారులకు సూచించారు.
భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్ మున్సిపల్ ఈ.ఈ మురళీ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఐ.డీ.ఓ.సీ లో కంట్రోల్ రూమ్ తనిఖీ కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్ లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 – 220183 కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
