పొంగుతున్న వాగులు- ఎస్సారెస్పి 39 గేట్ల ఎత్తివేత – భారీగా వస్తున్న వరద నీరు- పొంగి ప్రవహిస్తున్న కప్పల వాగు, పెద్దవాగు – భీంగల్ లో వరద నీటిలో జలదిగ్బంధమైన తాహసిల్దార్, ఎక్సైజ్ ఆఫీసులు- జలమయమైన లోతట్టు ప్రాంతాలు- సిరికొండ, ధర్పల్లి, భీంగల్ మండలాల్లో పోటెత్తిన వరద- ఆయా మండలాల్లో తెగిపోయిన చెరువు కట్టలు
ప్రకృతి ప్రశాంతంగా ఉంటే అందంగా కనబడుతుంది. అదే ప్రకృతి ప్రకోపానికి గురైతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. గత నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోతవాన జనజీవనాన్ని కకలవికలం చేసింది.
వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎస్సారెస్పీ, రామడుగు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
మరోవైపు కప్పల వాగు, పెద్దవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జక్రాన్ పల్లి సిరికొండ ధర్పల్లి భీమ్గల్ మండలాల్లో వరద నీరు పోటెత్తింది.
కొన్ని గ్రామాల్లో చెరువు కట్టలు తెగి పంట పొలాలు జలమయమయ్యాయి. – వరద నీటిలో చిక్కుకున్న ఎక్సైజ్ సిబ్బంది – భీంగల్ కప్పల వాగు శివారులో ఉన్న ఎక్సైజ్, రెవెన్యూ ఆఫీసులు జలదిబ్బందమయ్యాయి. వరద నీటిలో ఇద్దరు ఎక్సైజ్ సిబ్బంది చిక్కుకుపోయారు.
దీంతో బడా భీంగల్ – భీంగల్ గ్రామాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎగువ భాగాన కామారెడ్డి అటవీ ప్రాంతం నుండి దిగువని ఉన్న సిరికొండ మండలం మీదుగా ప్రవహించే కప్పల వాగులోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాగు నదిని తలపిస్తోంది.
అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. – ఎస్సారెస్పీ గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదలఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు పోటెత్తడంతో 39 గెట్లను ఎత్తివేసి గోదావరి నదిలోకి ఎస్సారెస్పీ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు లోకి 50 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 39 గేట్ల ద్వారా దిగువకు 3,01,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. వరద కాలువ, లక్ష్మి, కాకతీయ కాలువల ద్వారా గొదావరికి నదికి కలిపి 3,30,267 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నీటిని బయటకు వదులుతున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1087.50 అడుగుల నీరు వచ్చి చేరింది.ప్రస్తుతం 68.064 టీఎంసీలు నీటి నిలువ ఉంది. – పొంగి ప్రవహిస్తున్న వాగులు ఆర్మూర్ డివిజన్ లోని కప్పల వాగు, పెద్దవాగు లు పొంగి ప్రవహిస్తున్నాయి.
వాగులు వరద నీటి ప్రవాహంతో నిండిపోయాయి. మరో వైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మోతే – వేల్పూర్ గ్రామాల మధ్య నూతనంగా నిర్వహించిన బ్రిడ్జి పై నుండి వాగు నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆర్మూర్ పట్టణంలోని కొన్ని కాలనీలలో ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జాతీయ రహదారిల వెంట వెళ్లే లారీ డ్రైవర్లకు ఆయా మండలాల అధికారులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
మరింత భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
