నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం పారదర్శకంగా,పకడ్బందీగా చేస్తామని ఎఐసిసి జిల్లా పర్యవేక్షకుడు రిజ్వాన్ అర్షాద్ పేర్కొన్నారు.
సోమవారం నగరంలోని హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గత మూడు రోజులుగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు నియామకం కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
ఈ మేరకు జిల్లాలోని ముఖ్య నేతలతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించి ఏఐసిసి కి అంజేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంత వరకు ఎప్పుడూ కూడా జిల్లా అధ్యక్షుడు నియామకం ఇంత పకడ్బందీగా చేయలేదని పేర్కొన్నారు.
అయితే ఈసారి జిల్లా అధ్యక్షుడు నియామకం ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నియామకం కోసం తాము పరిశీలకులుగా వచ్చామని, వారం రోజుల పాటు జిల్లాల్లోనే ఉంటామని తెలిపారు.
వచ్చిన దరఖాస్తులలో నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాల సేకరించడానికి జిల్లాలో 10 బ్లాక్ లు చేశామని రేపటి నుంచి జిల్లాలో ప్రతి బ్లాక్ కు వెళ్లి సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు.
మెజారిటీ కార్యకర్తల సూచన మేరకే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలిపారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నవారు ఎవరైనా డీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేయవచ్చన్నారు.
డీసీసీ అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన అనంతరం కార్యకర్తల అభిప్రాయం మేరకే నియామకం ఉంటుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రతీ కార్యకర్తను, మండల కమిటీ నాయకులను తాను ప్రత్యక్షంగా కలవనున్నట్లు పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని (BRS Party) ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిందని, అదేవిధంగా రాబోయే లోక్సభఎన్నికల్లో కూడా దేశంలోని అన్ని జిల్లాల్లో డీసీసీలను బలోపేతం చేసి వారి ఆధ్వర్యంలో కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్సీ బల్మురి వెంకట్,రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, తాహెర్ బీన్ హందాన్, కేశ వేణు, అరికెల నర్సారెడ్డి, గడుగు గంగాధర్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
