రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
బుధవారం నాగారంలోనీ ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు–2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై రూపొందించిన అవగాహన పోస్టర్లను డిటిఓ ఉమామహేశ్వర్, ఏంవిఐ కిరణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా ఏటా వేలాది కుటుంబాలు వీధిన పడుతుండటం కలచివేస్తోందన్నారు.
“ప్రమాదాల నివారణలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, వాహనదారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు” అని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా యువత వేగంతో కాకుండా విచక్షణతో వాహనాలు నడిపి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమంతో పాటు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు మౌలిక సదుపాయాల మెరుగుదల, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల ఆధునీకరణకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆర్టీఏ అధికారి రాజానరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు, సాంకేతిక అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో నూడ చైర్మన్ కేశ వేణు, రాం భూపాల్, గడుగు గంగాధర్, విపుల్ గౌడ్తదితరులు పాల్గొన్నారు.
