మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ నగరంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. నగరంలోని 11వ డివిజన్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందనుకున్న తరుణంలో కాంగ్రెస్, ఎంఐఎం వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.
బాబన్ సహాన్ పహాడ్ ప్రాంతంలో ఇరు పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు బాహాబాహీకి దిగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 11వ డివిజన్ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి కరీం అనుచరులు బోగస్ ఓట్లు వేయిస్తున్నారని ఎంఐఎం అభ్యర్థి జక్కియోద్దీన్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎంఐఎం నేతలు దీనిని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
ఈ ఘర్షణలో కాంగ్రెస్ అభ్యర్థి కరీం తలకు తీవ్ర గాయమైంది. తల నుంచి రక్తం కారడంతో ఆయనను వెంటనే సహచరులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కరీం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
తమ అభ్యర్థిపై కావాలనే ఎంఐఎం శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసుకు స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం బాబన్ సహాన్ పహాడ్ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్కు ఆటంకం కలగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.
