Monday, April 20, 2026
HomeCRIMEప్రాణం తీసిన…బోరు పంచాయతీ….మామను కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపిన మేనల్లుడు..లింగపూర్‌లో రాజకీయ సెగ.. మాజీ...

ప్రాణం తీసిన…బోరు పంచాయతీ….మామను కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపిన మేనల్లుడు..లింగపూర్‌లో రాజకీయ సెగ.. మాజీ ఎంపీపీ, ప్రస్తుత సర్పంచ్ ఇమ్మడి గోపి దారుణ హత్య..

పాత కక్షలు పడగ విప్పాయి.. బోరు వివాదం చివరకు ప్రాణం తీసింది. రాజకీయంగా ఎదిగిన మామపై పెంచుకున్న కక్ష, నీటి బోరు సీజ్ చేసిన వ్యవహారం వెరసి ఓ మాజీ ఎంపీపీ, వరుసగా మూడోసారి సర్పంచ్‌గా గెలిచిన ప్రజాప్రతినిధిని బలితీసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లింగపూర్ గ్రామ సర్పంచ్ ఇమ్మడి గోపి బుధవారం రాత్రి తన మేనల్లుడు సతీష్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు.

ఈ ఘటన జిల్లావ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. లింగపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నీటి బోరును అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అక్రమంగా వాడుతున్నాడన్న ఫిర్యాదుతో వివాదం మొదలైంది. దీనిపై సర్పంచ్ ఇమ్మడి గోపి వెంటనే స్పందించి, బుధవారం ఉదయం ఆ బోరును సీజ్ చేయించారు.

ఇదే తరుణంలో గత పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మామ, మేనల్లుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ శత్రుత్వం ఉంది. అప్పట్లో గోపి తన భార్యను సర్పంచ్ బరిలో నిలపగా, మేనల్లుడు సతీష్ మామకు ఎదురుతిరిగి పోటీ చేశాడు. అప్పటి నుంచి సతీష్ ప్రతి విషయంలోనూ మామకు అడ్డుతగులుతూ కక్ష పెంచుకున్నట్లు సమాచారం.

బోరు సీజ్ చేసిన వ్యవహారంతో రగిలిపోయిన సతీష్, మామ గోపిని అంతమొందించాలని స్కెచ్ వేశాడు. బుధవారం రాత్రి గోపి పనుల నిమిత్తం గౌరారం వెళ్లి కారులో తిరిగి వస్తుండగా, సతీష్ తన అనుచరులతో కలిసి కాపుకాశాడు. గోపి కారును తమ వాహనంతో బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిందని భావించి గోపి కారు దిగగానే, సతీష్ బృందం ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడింది.

గోపిని కిరాతకంగా నరికి చంపడంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. హతుడు ఇమ్మడి గోపికి రాజకీయంగా గట్టి పట్టుంది. గతంలో ఆయన నక్సలైట్ ఉద్యమంలో ఉండి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు. గతంలో ధర్పల్లి ఎంపీపీగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం వరుసగా మూడోసారి సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండటంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితుడు సతీష్, అతని ఆరుగురు అనుచరులను పోలీసుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.రాజకీయ వైరం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి, చివరకు హత్యకు దారితీయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!