మోపాల్ మండలంలోని సిర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న కానుగుల కృతికకు జాతీయస్థాయి కథా బహుమతి లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ తెలిపారు.
సోమవారం నాడు ఏర్పాటుచేసిన విద్యార్థి అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత ఫిబ్రవరి నెలలో సైన్స్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ కథల పోటీని నిర్వహించారనీ, ఈ పోటీలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కథలను రాసి పంపారన్నారు.
ఈ పోటీలలో సుమారు 350 కథలు వచ్చాయనీ, వీటి నుండి 15 కథలను ఉత్తమ కథలుగా ఎంపిక చేశారని వారు తెలిపారు.దీనిలో కృతిక రాసిన “బ్రేవ్ గర్ల్” అనే కథకు ఉత్తమ కథా బహుమతి లభించిందన్నారు. సిర్పూర్ పాఠశాల నుండి 11 కథలు పంపించగా కృతిక బహుమతిని సాధించిందన్నారు.
కృతిక కు పాఠశాల ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. విద్యార్థి విజయానికి కారకులైన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేశ్ రావును ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు కానుగుల స్వాతి సంజీవ్, ఉపాధ్యాయులు శ్యామల,మోహన్, వందన,అక్బర్ బాషా, డాక్టర్ హజారే శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
