తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, కుల గణన సర్వే ప్రక్రియలో కీలక భూమిక పోషించిన ఎక్స్పర్ట్ కమిటీకి ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కృతజ్ఞతలు వెల్లువెత్తాయి.

దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ సర్వేను నిర్వహించడంలో మార్గదర్శకత్వం వహించిన కమిటీ చైర్మన్, సుప్రీం కోర్ట్ మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
మర్యాదపూర్వక భేటీ – ఘన సన్మానం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా వారి నివాసానికి వెళ్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో, శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.
కమిటీ సభ్యులు రేయింబవళ్లు శ్రమించి, అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నివేదికను సిద్ధం చేశారు” అని ప్రశంసించారు.
