జిల్లాలోని సిరికొండ మండలం రావట్ల గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామంలోని అటవీ భూముల కబ్జాను అరికట్టాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో కలెక్టరేట్ ప్రాంగణం వద్ద హైడ్రామా నెలకొంది.
రావట్ల గ్రామ పరిధిలోని అటవీ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆరోపించారు. అటవీ శాఖ అధికారుల అండదండలతోనే కబ్జాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తమ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సుమారు వంద మందికి పైగా మహిళలు, గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్కు చేరుకున్నారు. కార్యాలయ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఏసిపి ప్రకాష్ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు.
సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేరుగా వచ్చి గ్రామస్తుల సమస్యలను విని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కలెక్టర్ వచ్చి స్వయంగా హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని గ్రామస్తులు పట్టుబట్టారు.
నిరసన కొనసాగుతుండగా, దాదాపు రెండు గంటల తర్వాత డీఎఫ్ఓ సిద్ధార్థ అక్కడికి చేరుకున్నారు. అటవీ భూముల ఆక్రమణను పూర్తిగా అడ్డుకుంటామని, కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.
అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపైనే ఉందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు.
