శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో నిర్వహించిన ఈ వేడుకలలో ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. కుల, మత, లింగ, వర్గ, వర్ణ భేదాలకు వ్యతిరేకంగా బసవేశ్వర చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.
అందుకే ఆయనను విశ్వ గురువుగా, గొప్ప దార్శనికుడిగా, సంస్కారవాదిగా ప్రపంచం కీర్తిస్తుందని గుర్తు చేశారు. మహనీయుల ఆలోచన విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. వీరశైవ సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, రుద్రభూమి ఏర్పాటు గురించి ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వీరశైవ సమాజ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి బస్వరాజ్, ప్రతినిధులు ససిద్ధి రాములు, రాజు, సంతోష్, నాగరాజు, సదాశివ్, కాశీనాథ్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
