నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశ వేణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలోని విద్యార్థులు, యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో బిజెపి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, పోటీ పరీక్షల పేపర్ లీకేజీలతో యువతను నిలువునా మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే విద్యార్థుల గొంతును నేరుగా వినేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, దేశ యువత భవిష్యత్తు కోసం చేపట్టిన జాతీయ ఉద్యమమని పేర్కొన్నారు.
విద్యార్థుల పోరాటమే దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు నాంది కావాలని, యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాడుతుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్, ప్రీతం, ముస్తఫా, గోవర్ధన్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.
