కాలేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో రెండు ఒకటేనని స్పష్టమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పిసి గోష్ కమిషన్ పేరుతో రెండేళ్లపాటు కాలయాపన చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావును, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఇప్పటి వాకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ప్రాజెక్టు వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని స్వయంగా కాంగ్రెస్ ఆరోపించి, ఇప్పుడేమో కోర్టులో 9 వేల కోట్లు అవినీతి జరిగిందంటూ పిటిషన్ వేయడం వెనక ఆంతర్యం ఏమిటో తెలపాలన్నారు.
అవినీతి పరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి లేఖ రాయాలన్నారు.
అలాగే హై కోర్టు స్టే ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. అర్బన్ లో పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. సిడీపీ ఫండ్ లేక పనులు ముందుకు సాగడం లేదన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరుకు వచ్చిన ప్రతిసారి అభివృద్ధి అంటారు, కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాయన్నారు.
అలాగే మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం దారుణమన్నారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, సీనియర్ నాయకులు న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్, సత్యపాల్, పుట్ట వీరేందర్, మండల అధ్యక్షుడు పడాల భూపతి, పిల్లి శ్రీకాంత్, అమంద్ విజయ్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
