13 మందికి గాయాలుఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్యజాతీయ రహదారి 44పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని అర్గుల్ గ్రామ శివారులో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్సు (TS 16 UB 2255) రాత్రి 7:30 గంటల సమయంలో అర్గుల్ వద్ద ప్రయాణికులను దించేందుకు ఆగింది.
అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన హర్యానాకు చెందిన లారీ (HR 46 U 5859) బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా, లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లాచెదురై తీవ్ర గాయాలపాలయ్యారు.
విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్వయంగా పర్యవేక్షించి, అంబులెన్స్లలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.
ప్రమాదం కారణంగా రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ను జేసీబీ సాయంతో వాహనాలను పక్కకు తొలగించి పునరుద్ధరించారు. ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సీపీ ప్రమాద స్థలిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారిపై రోడ్ స్టాపర్లు, డివైడర్ల ఏర్పాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీపీ వెంట ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్, ఇందల్వాయి ఎస్సై సందీప్ తదితరులు ఉన్నారు.
