వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి పురస్కరించుకొని ఆదివారం కిషన్ గంజ్ లో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ… ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు. అంతకుముందు అమ్మవారికి ఆభరణాలు సమర్పించారు.
వైభవంగా శోభాయాత్ర…నగరంలోని పెద్ద బజారులో గల నగరేశ్వర దేవాలయం వద్ద ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శివాజీ నగర్ పెద్ద బజార్ గాంధీచౌక్ మీదుగా కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఒగ్గు కళాకారులు, పులి వేషాలు, బోనాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు ఆధ్యాంతం కన్నుల పండుగ కొనసాగింది.
ఘనంగా డోలారోహణ…నగరంలోని కిషన్ గంజ్ వాసవి మాత ఆలయంలో అమ్మవారి నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా వాసవి మాతకు నామకరణం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు పాల్తే రవి కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, కోశాధికారి మామిడి శేఖర్, పట్టణ సంఘం అధ్యక్షుడు ధనపాల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
