జన గణన ప్రక్రియలో భాగంగా వివిధ శాఖల జిల్లా అధికారులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు పాల్గొన్న సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఈ మేరకు అధికారులు తమ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జన గణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు.
ప్రతి నివాస ప్రాంతంలో స్వీయ గణన గురించి అవగాహన కల్పించాలని, ప్రతి కుటుంబం జన గణనలో స్వీయ నమోదు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు. ఈ నెల 26న ప్రారంభం అయిన స్వీయ గణన ప్రక్రియ మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని, గడువు లోపు ప్రజలు స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు.
