నిజామాబాద్ నిప్పుల కొలిమి గా మారింది భానుడి దగ దగ తో ప్రజలు మధ్యాహ్నం రోడ్ల మీదికి రావడానికే జంకుతున్నారు ఉదయం నుంచే సూర్యుడి ప్రతాపానికి ప్రజలు నీరసించిపోతున్నారు. తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. . నిజామాబాద్ జిల్లాలో నిన్న అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
అలాగే ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీలు, ఇతర జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.యాసంగి పొలం పనులు పూర్తీ అయినప్పటికీ గ్రామాల్లో రైతులు ఇంకా వడ్ల కుప్పల వద్దే కాలం వెళ్లదీస్తున్నారు.
వారు ఎండ వేడీ తాళలేక పోతున్నారు. మధ్యాహ్న సమయంలో నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరై బయటికి వస్తున్న నెత్తిమీద టోపీలు లేదంటే రుమాళ్ చుట్టుకుంటున్నరు వేడి నుంచి ఉపశమనం పొందడానికి తాటి బుంజలు కొబ్బరి నీళ్లు లేదంటే కూల్ డ్రింక్ లు తాగుతున్నారు.
రోజువారి కూలి పనులు చేసుకునే వారు ఎండల కు తట్టుకోలేక పోతున్నారు.కేవలం ఎండ తీవ్రత మాత్రమే కాకుండా, మధ్యాహ్నం వేళ వీస్తున్న వడగాల్పులు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు అడవిలోని మూగజీవాలు, ఇటు పెంపుడు పశువులు తాగునీరు దొరకక, ఎండ వేడిని భరించలేక విలవిలలాడుతున్నాయి.
చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పశువుల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ కలిపిన నీరు, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
