ప్రేమ పేరుతో ఓ యువకుడు చేసిన మోసం తట్టుకోలేక మనస్తాపానికి గురైన బాధిత యువతి పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బాల్కొండలో కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే..
బాల్కొండ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతికి అదే గ్రామానికి చెందిన బాసెట్టి సాయికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సాయికుమార్ అప్పటికే వివాహితుడైనప్పటికీ, ఆ విషయాన్ని పూర్తిగా దాచిపెట్టి సదరు యువతికి ప్రేమ వల విసిరాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతడిని గాఢంగా నమ్మింది. అయితే, కొంతకాలం తర్వాత అతని అసలు స్వరూపం, వివాహం జరిగిన విషయం బయటపడటంతో యువతి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.
తాను మోసపోయానని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురైంది.న్యాయం కోసం సదరు యువతి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అయితే, తన జీవితం నాశనమైందన్న ఆవేదనలో ఉన్న ఆమె, ఫిర్యాదు చేసే క్రమంలోనే పాత పోలీస్ స్టేషన్ భవనం పైకి చేరుకుంది. ఎవరూ ఊహించని విధంగా పైనుంచి కిందకు దూకేసింది.
భవనం పైనుంచి ఒక్కసారిగా కింద పడటంతో యువతి నడుము భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
