స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు.
అనవసర వ్యయాన్ని తగ్గించుకుని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఉత్తర తెలంగాణా స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్.సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణా జిల్లాల నుండి విచ్చేసిన అదనపు కలెక్టర్లు తమతమ జిల్లాలలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు.
నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని, పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పని చేయాలని మార్గనిర్దేశం చేశారు.
చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి, అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి, మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు.
అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపెతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్ధానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సలహాలు స్వీకరించారు.
వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడించారు. సదస్సులో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ఉత్తర తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్లు దిలీప్ కుమార్, అశ్విని తానాజీ వాకడే, రాజాగౌడ్, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, నిజామాబాద్ జెడ్పీ సీ.ఈ.ఓ సాయగౌడ్, డీపీఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్ లు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
