పోక్సో కేసు నిందితుడు పరారీలో ఉన్నాడంటూ వెలిసిన ప్రకటనలుకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదంటూ నగరవ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఆయన ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఆ పోస్టర్లలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతం, గోడలు, విద్యుత్ స్తంభాలపై ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
“నిందితుడు పరారీ.. ఆచూకీ తెలపండి” అంటూ రాసి ఉన్న ఈ ప్రకటనలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
ఈ పోస్టర్లను ఎవరు అంటించారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇది వేదికైంది. తీవ్రమైన పోక్సో కేసు నమోదైనప్పటికీ, నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర మంత్రి కుమారుడు కావడమే అరెస్టు కాకపోవడానికి కారణమని పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల అలసత్వాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బాధితుల తరపు వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ పోస్టర్ల వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారో, నిందితుడి ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
