ఇందూరు: సనాతన ధర్మాన్ని కాపాడటంలో బ్రాహ్మణులు ఎల్లప్పుడూ ముందుంటారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. గో సేవా సమితి ఆధ్వర్యంలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం 108 మంది బ్రాహ్మణ దంపతులకు వాయనం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక జ్యేష్ట మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందన్నారు. సమితి సభ్యులు గో సేవ చేయడమే కాకుండా.. హిందూ ధర్మాన్ని కాపాడే అనేక కార్యక్రమాల్లో ముందు ఉండడం అభినందనీయం అన్నారు.
అలాగే వైశ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో గో సేవాసమితి అధ్యక్షుడు వీరమల్లు రమేష్, లక్ష్మీకాంతం గుప్తా, యాదగిరి గుప్తా, యంసాని రవీందర్ గుప్తా, బ్రాహ్మణులపల్లి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
