మండల పరిధిలోని తీర్మాన్ పళ్లి గ్రామ పరిధిలో శుక్రవారం ‘మన ఊరు – మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు, తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో కొందరు యువకులు సరదాగా మొదలుపెట్టి గంజాయి, ఇతర మత్తు పదార్థాల వైపు మళ్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం, మత్తులో చేసే చిన్న చిన్న పొరపాట్లు వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయని పేర్కొన్నారు.
పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండటంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు వస్తున్నాయా? వారు ఎవరెవరితో తిరుగుతున్నారు? అనే విషయాలను నిరంతరం గమనించాలి.
మీ పిల్లల స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయం గడిపి, వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి.
గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగం గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
యువత వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నత చదువులతో గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
