తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతియేటా ఆవిర్భావ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నామన్నారు.
పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని తెలిపారు.
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వీరికి వినతిపత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ..
తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగరంలోని జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
