ఆషాడ మాసంలో ఘనంగా నిర్వహించే ఊర పండగ అమ్మవార్ల గద్దెను భక్తుల సౌకర్యార్థం మార్పులు చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. సర్వ సమాజ్ కమిటీ పెద్దలతో కలిసి బుధవారం నగరంలోని ఖిల్లా ప్రాంగణంలో గల గద్దెలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు దేవుళ్లు దూరం నుంచి కూడా కనపడేలా ఎత్తు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే గద్దె ను అదనంగా నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఊర పండగ కు సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
గద్దె వద్దకు ఇందూరు భక్తులు భారీగా తరలివస్తారని, ఇబ్బందులు కలగకుండా అదనపు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే మొరంతో గద్దె చుట్టుపక్కల చదును చేయించాలన్నారు.
అనంతరం సర్వ సమాజ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాడ మాసం మూడో ఆదివారం ఊర పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. అయితే ఈసారి సంకటహర చతుర్థి రావడంతో ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గద్దె అదనపు నిర్మాణానికి సహకరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊర పండగ కన్వీనర్ రామర్తి గంగాధర్, స్థానిక కార్పొరేటర్ మల్కాయ్ మహేందర్, మున్నూరు కాపు సంఘం గాజులపేట అధ్యక్షుడు కొరడి కిరణ్, లక్ష్మీనారాయణ కొరడి నడిపి నరసయ్య, మను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రవీందర్, రాజేందర్, లింబాద్రి, సంతోష్, సాయినాథ్, జితేందర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, కల్పే అర్చనా చిరంజీవి, మాజీ కార్పొరేటర్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
