జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల లో సుమారు రెండు వందల కోట్ల రూపాయల మేరకు రైతుల నుంచి లూటీ చేసారని కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు అధికారులు అంతా కుమ్మక్కై అన్నదాతల కష్టాన్ని కొల్లగొట్టారని అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ ఆరోపించారు.
ఈ మేరకు బుధవారం ఆయన నేతృత్వంలోని రైతు ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేసింది.జిల్లాలో ఈ ఏడాది 82.6 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జరగగా, అందులో 8.26 లక్షల క్వింటాళ్లను అక్రమంగా తరుగు పేరుతో కొల్లగొట్టారని ప్రభాకర్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల (ఐకేపీ, సహకార సంఘాలు) నిర్వాహకులు, రైస్ మిల్లర్లతో లాలూచీ పడి రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన మండిపడ్డారు.
సిరికొండ మండలం అమీర్నగర్ ఐకేపీ కేంద్రంలో దందా దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సంచుల సంఖ్య పెంచి, హమాలీ చార్జీల ద్వారా ఎక్కువ సొమ్ము దండుకోవాలనే దురాశతో, 40 కిలోల సంచికి కేవలం 38 కిలోల 600 గ్రాములే తూకం వేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు రూ. 27 చొప్పున హమాలీ చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే రైతులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం కేంద్రాలు నిర్వహిస్తుంటే, అధికారులు మాత్రం మిల్లర్ల కొమ్ము కాస్తూ రైతును దగా చేస్తున్నారని వి. ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
