ఆర్మూరు పట్టణంలోని భరత్ చంద్ర స్కూలులో జరిగిన ఘటన నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కఠిన నిర్ణయం తీసుకున్నారు.
పట్టణంలో రేపటి వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో సెక్షన్ 144 ) అమలులో ఉంటుందని ఆయన ప్రకటించారు. స్కూలు ఘటన తర్వాత పట్టణంలో బంద్ కాల్, ధర్నాలు, ర్యాలీలు మరియు రాస్తారోకోల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ ఆంక్షలు విధించారు. ఈ రోజు (జూన్ 29) ఉదయం 6 గంటల నుండి రేపు (జూన్ 30) సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
ఈ సమయం వరకు ఎవరూ గుంపులుగా చేరకూడదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
పట్టణంలోని అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచామని, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజలందరూ సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. ఆర్మూరులో అదనపు బలగాలతో నిరంతరం పహారా కాస్తున్నట్లు సమాచారం.
