నగరంలోని పలు పాఠశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశింధర్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు సభ్యత్వ రశీదులను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శశింధర్ మాట్లాడుతూ.. 1949, జూలై 9న అతి తక్కువ మందితో ఆరంభమైన ఏబీవీపీ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని తెలిపారు.
విద్యార్థుల్లో దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ధ్యేయంగా ఏబీవీపీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. కేవలం ఉద్యమాలకే పరిమితం కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నామని పేర్కొన్నారు.
విద్యార్థుల సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తోందని ఆయన వివరించారు. స్కాలర్షిప్ల పంపిణీలో జాప్యం, నిరుపేద విద్యార్థుల బస్ పాస్ సమస్యల పరిష్కారంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాడుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంసెట్, పాలిటెక్నిక్ వంటి ప్రవేశ పరీక్షలకు తమ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర సంఘటన మంత్రి బద్దిగే శివ ప్రసాద్, కార్యకర్తలు సౌరబ్, చెర్రీ, దీపంత్, పుల్వంత్, శశాంక్, దుర్గాదాస్, బాలు, శ్రీసాంత్, తిరుపతి, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
