సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు బుధవారం తెరిచారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టులోని 14 గేట్లను మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పైకి ఎత్తారు.
దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు దిగువకు విడుదలయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచాలని నిబంధన ఉంది. ఈ మేరకు నిర్ణీత సమయం ఆసన్నం కావడంతో బుధవారం ఉదయం అధికారులు గేట్లను ఎత్తారు.
ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా ఎగువ, దిగువ ప్రాంతాల మధ్య నీటి పంపిణీలో సమన్వయం పాటిస్తున్నారు. గేట్ల నిర్వహణ, నీటి విడుదల ప్రక్రియను రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరే అవకాశం ఉండటంతో, అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
