బాల్కొండ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్షలైన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరుతూ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ‘కఠోర నిరాహార దీక్ష’ను ప్రభుత్వం పోలీసుల సహాయంతో అణిచివేసింది.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది అప్రజాస్వామికమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బుధవారం తనను గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై, 75 శాతం పూర్తి చేసుకున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మూతపడిన బస్ డిపో మరియు పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
“ప్రజల కష్టాలను తీర్చమని కోరితే, ప్రభుత్వం అహంకారంతో పోలీసులను ప్రయోగించి గొంతు నొక్కాలని చూస్తోంది. ఇది రాక్షస పాలనకు నిదర్శనం” అని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పెండింగ్ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని, అప్పుడు తాను దీక్ష విరమిస్తానని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పోలీసులతో బెదిరిస్తే భయపడే వ్యక్తిని నేను కాదు. నేను ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా నా దీక్ష కొనసాగుతుంది. ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను అని ఆయన తేల్చి చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు, యువత మరియు ప్రజలందరూ ఈ పోరాటానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
ఉదయం నుంచి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.కనీసం బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం.నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అక్రమ అరెస్టులు. భీంగల్ దీక్షా శిబిరం తొలగింపు, ఫ్లెక్సీల ధ్వంసం.నిరసనను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
